నాగార్జునసాగర్‌లో కూడా విద్యుదుత్పత్తి

 

శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం వివాదాస్పదంగా మారినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో కూడా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్లో 27వేల క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా వుండగా, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్కు పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ లేఖ రాశారు. సాగర్ నీటితో పులిచింతల నిండుతోందని, దీనివల్ల నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే నాగార్జున సాగర్ అధికారులు మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేమని పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు. సాగర్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే విద్యుత్ కోత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. దీంతో అటు శ్రీశైలంతోపాటు ఇటు నాగార్జునసాగర్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పదంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు అయింది.