ఓ ఫ్యాన్, ఓ లైట్.. నెల కరెంట్ బిల్ మాత్రం రూ.128 కోట్లు

 

ఓ సాధారణ కుటుంబానికి.. ఎప్పుడూ నెలకి రూ. వందల్లో వచ్చే కరెంట్ బిల్, ఒక్కసారిగా వంద కోట్లకి పైగా ఎలా వస్తే ఎలా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం మూలంగా ఓ కుటుంబానికి అలాంటి పరిస్థితే ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని చామ్రి గ్రామంలో షామిమ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నాడు. అతనికి 2 కిలోవాట్ల లోడ్ తో కరెంట్ కనెక్షన్ ఉంది. గత నెల కరెంట్ బిల్ రూ. 128,45,95,444 వచ్చింది. దీంతో ఆయన విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా, వారు తామేమీ చేయలేమని చేతులెత్తేశారట.

'ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా మాట ఎవరూ వినడం లేదు. ఇంత మొత్తాన్ని మేమెలా కట్టాలి? డబ్బు కడితే తప్ప కరెంట్ కనెక్షన్ ను కొనసాగించలేమని అధికారులు చెబుతున్నారు' అని షామీమ్ వాపోయారు. నెలకు రూ. 700 నుంచి రూ. 800 మధ్య బిల్లు తమకు వచ్చేదని, మొత్తం తమ ప్రాంతంలో కూడా నెలలో ఇంత బిల్లు రాదని అన్నాడు. ఉన్నతాధికారులను ఎవరిని సంప్రదించినా సాయం చేయడం లేదని, తన ఇంట్లో ఓ ఫ్యాన్, ఓ లైట్ మాత్రమే ఉన్నాయని అన్నారు. తమది చాలా పేద కుటుంబమని, తన జీవితాంతం సంపాదన కూడా అంత మొత్తం ఉండదని వాపోయాడు. దీంతో మీడియా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఇది సాంకేతిక సమస్య కారణంగా వచ్చిన బిల్ అని, దీన్ని సరిచేస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.