పోస్ట్ మాన్ పై ప్రశంసల వర్షం.. ఆయన రియల్ హీరో

మనం చేసే పని చిన్నదా పెద్దదా?.. ఎంత సంపాదిస్తున్నాం?.. ఇవి కాదు ముఖ్యం. మనం చేసే పని ఇష్టంతో చేస్తున్నామా లేదా?.. మన పనిని ఎంత గౌరవిస్తున్నాం? ఎంత నిబద్దత, నిజాయితీతో చేస్తున్నాం?.. ఇవి ముఖ్యం. అప్పుడే మన జీవితానికి మనం రియల్ హీరోలమవుతాం. ఇప్పుడు అలాంటి రియల్ హీరో గురించే చెప్పుకోబోతున్నాం.

ఆయన పేరు డి. శివన్. తమిళనాడులోని కూనూర్ పోస్టాఫీస్ లో పోస్టుమాన్. 66 ఏళ్ల శివన్.. గతవారంలో రిటైర్ అయ్యేంత వరకు 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు. దట్టమైన అడవిలో క్రూర మృగాలకు సైతం వెరవకుండా రోజుకు 15 కిలోమీటర్లు నడిచి, బాహ్య ప్రపంచం తొంగిచూడలేని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ఉత్తరాలు అందించి విధులు నిర్వహించారు. తన విధుల్లో భాగంగా నీలగిరి మౌంటైన్ రైల్వే ట్రాక్‌ మీదుగా వెళ్లేటప్పుడు పలుమార్లు ఏనుగులు, ఎలుగుబంట్లు, ఇతర అడవి జంతువులు వెంటపడ్డాయి. ఎన్నోసార్లు విష సర్పాలు ఆయనపై బుసకొట్టాయి. అయినా శివన్ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. 2016లో వచ్చిన ఓ కథనం ప్రకారం ఆయన జీతం రూ.12 వేలు. దానినిబట్టే అర్థంచేసుకోవచ్చు.. ఆయనకు ప్రేమ, ఆయన సంపాదించే డబ్బుపై కాదు.. ఆయన చేసే పనిపై అని. 

శివన్ పదవీ విరమణ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "డి. శివన్ ఉత్తరాలు చేరవేసేందుకు రోజుకు 15 కిలోమీటర్లు దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లారు. అడవి జంతువులు వెంటపడినా.. వెనుకంజ వేయలేదు. వాగులు వంకలు దాటుకుంటూ సేవలు అందించారు. 30 ఏళ్లపాటు అత్యంత అంకితభావంతో పనిచేశారు." అని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. రోజుకు 15 కిలోమీటర్లు నడిచి విధులు నిర్వహించిన పోస్టుమాన్‌ శివన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనను సూపర్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. కూనూర్ పోస్టు ఆఫీసుకు శివన్ పేరు పెట్టాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.