రోడ్డుమీద కుప్పలుతెప్పలుగా ఆధార్ కార్డులు

 

ఒకే దేశము ఒకే గుర్తింపు అనే లక్ష్యంతో ఆధార్ అనే 12 అంకెల గుర్తింపు కార్డును ప్రవేశపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు రోడ్డు పాలు అయింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు రోడ్డు మీద కనిపిస్తున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల పోస్టాఫీసుకు లబ్ది దారులకు పంపిణీ చేయాల్సిన ఆధార్ కార్డులు వచ్చాయి. అయితే వాటిని పంపిణీ చేయటంలో నిర్లక్ష్యం వహించాడు పోస్ట్ మాన్ హుస్సేన్. భోజనానికి వెళ్లి అక్కడి హోటల్ లో వాటిని మర్చిపోయాడు. ఆ హోటల్ వాళ్లు వాటిని కొన్నాళ్లుగా భద్రపరిచి ఇక చేసేదేమీ లేక రోడ్డుపై పడేశారు. వీటిని గమనించిన కొందరు విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు విచారించగా పోస్ట్ మాన్ నిర్లక్ష్యమే దీనికి కారణమని తేల్చేసారు. అయితే హుస్సేన్ మాత్రం ఎప్పటి నుంచో వెతుకుతున్న కనపడట్లేదని, తాను రోజు ఆ హోటల్ లోనే భోజనం చేసేవాన్నని తెలిపారు. కావాలని తప్పు చేయలేదని , ఆ రోజు అక్కడ మర్చిపోవటం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు.