తండ్రిని మించిపోయిన కేటీఆర్

 

అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ తండ్రిని మించి పోయాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పొన్నం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో మార్నింగ్ వాక్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేటీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే అబద్దాలు చెప్పి ఓట్లు దండుకుందామని ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైల్వే లైను తెస్తానని అబద్దాలు చెప్తున్నాడని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో తెలేని రైలు మరో రెండేళ్లలో తెస్తాడా అని నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా సిరిసిల్లలో చేనేత కార్మికులను పట్టించుకోని కేటీఆర్ ప్రపంచానికే తలమాణికంలా వస్త్రపరిశ్రమను సిరిసిల్లకు తీసుకువస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను కూల్చేందుకే మహాకూటమిని ఏర్పాటు చేశామని పొన్నం చెప్పుకొచ్చారు. కేసీఆర్ అబద్దపు హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.