లోకేష్ బస్సు యాత్రకు సాక్షి

 

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో తమకు శత్రువయిన తెలుగుదేశం పార్టీ గురించి వ్యతిరేఖ వార్తలు ప్రచురింపబడటం సహజమే. కానీ, ఈ రోజు, ఆ పత్రిక అన్ని పత్రికల కంటే ముందుగా త్వరలో లోకేష్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నట్లు ఒక వార్త ప్రచురించడం విశేషం. జూన్ 2వ వారం నుండి లోకేష్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేసింది. చంద్రబాబు కూడా ఇక ముందు గ్రామాల పోలిమేరవరకు బస్సులోనే ప్రయాణించి, గ్రామంలో మాత్రమే పాదయాత్ర చేయనున్నారని, వచ్చే నెల 27 తరువాత పాదయాత్రకి ముగింపు పలికి, కొద్ది రోజుల విశ్రాంతి తీసుకొన్న తరువాత ఆయన కూడా బస్సు యాత్ర చేసి మిగిలిన జిల్లాలను పర్యటిస్తారని తెలియజేసింది. చంద్రబాబు పాదయాత్ర ముగింపు గురించి ఇప్పటికే అందరికీ తెలిసినప్పటికీ, ఆయన రెండు గ్రామాల మద్యన బస్సులో ప్రయాణించడం, లోకేష్ బస్సు యాత్ర గురించి మాత్రం అందరికంటే ముందుగా సాక్షి పేపరే వివరాలు అందజేయడం విశేషం. అయితే, లోకేష్ బస్సు యాత్ర గురించి ఇంకా అధికార ప్రకటన వెలువడక మునుపే సాక్షిలో ఈ వార్త రావడం మరో విశేషం.