జగన్ చొక్కా కావాలని కోర్టులో పిటిషన్

 

విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అయ్యింది.ప్రస్తుతం దాడి చేసిన నిందితున్ని విచారిస్తున్న పోలీసులు హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాను జగన్‌ నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిపై విమానాశ్రయంలో మాట్లాడిన విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌..హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాకు రక్తం అంటడంతో జగన్‌ దాన్ని మార్చుకుని, మరొకటి వేసుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారని తెలిపారు.విచారణలో భాగంగా హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాను జగన్‌ నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు.నిందితుడు శ్రీనివాసరావు సెల్‌ఫోన్ల కాల్‌ డేటాను విశ్లేషించామని, 321 మందితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న శ్రీనివాసరావు స్నేహితుడు కూడా విశాఖ వచ్చాడని అతని నుంచీ సమాచారం రాబడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.