శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. బీజేపీ ఓడిపోతే శ్రీరాముడికి ఏమౌతుంది?

శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్  చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 న‌డిచింది.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ న‌డుస్తోంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పంద్రాగస్టు లోగా రుణ‌మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రోసారి మోసానికి య‌త్నిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.  చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. 93 కులాల‌ను ఐక్యం చేసిన బాహుబ‌లి కాసాని జ్ఞానేశ్వ‌ర్‌. ఒక బ‌ల‌మైన నాయ‌కుడు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు గొంతుకై నిల‌బ‌డ్డాడు. అలాంటి కాసానిని గెలిపించాలి అని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కోరారు. ర్యాలీలో ఆయ‌న  మాట్లాడుతూ..బిజెపి , కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే బిజెపికి తెలుసనీ.. మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తున్న బిజెపికి తగిన బుద్ది చెప్పాలని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. పదే పదే బండి సంజయ్ మోడీ దేవుడంటూ చెప్పుకొస్తాడు..అసలు మోడీ దేవుడు ఎలా అవుతాడు. సిలిండ‌ర్ ధ‌ర పెంచినందుకు అవుతాడా.. ? పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచినందుకు అవుతాడా..? నిత్యా అవసర ధరలు పెంచినందుకు అవుతాడా.? తెలంగాణ కు ఎలాంటి హోదాలు ఇవ్వనందుకు అవుతాడా..? ఎలా అవుతాడని కేటీఆర్ ప్రశ్నించారు.  10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని కేటీఆర్ అన్నారు.  ఏమ‌న్న అంటే జైశ్రీరాం త‌ప్ప ఇంకోటి లేదు. తెలంగాణ‌కు ఒక్క కాలేజీ, పాఠ‌శాల ఇవ్వ‌లేదు. గుడికి పైస‌లు ఇవ్వ‌లేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ‌లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై  కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు.    చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై బీఆరెస్ అభ్య‌ర్థిగా రంజిత్ రెడ్డి గెలుపొందారు. ఓట‌మి త‌రువాత విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు. ఇక బీఆరెస్ అభ్య‌ర్థి విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్ అండ‌తో చేవెళ్ళ‌లో భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని కాసాని చెబుతున్నారు. త‌ను లోక‌ల్ అభ్య‌ర్థి అని ఆయ‌న చెబుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు కాసాని. ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. ఇవ‌న్ని త‌న‌కు ప్ల‌స్ అవుతాయ‌నే కాసానికి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు కాసాని. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నో పరిశ్ర‌మ‌ల్ని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తెచ్చింది. చేవెళ్ల‌ను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా త‌యారు చేసే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేశారు.  షాబాద్‌లో వెల్‌స్ప‌న్ ఫ్యాక్ట‌రీ తెచ్చుకున్నాం. కైటెక్స్ ప‌రిశ్ర‌మ తెచ్చుకున్నాం. చంద‌న్‌వెల్లిలో అమెజాన్, ఈస్ట‌ర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్‌లో ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్స్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం. విక‌రాబాద్, చేవెళ్ల, తాండూరు, ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్లు తేవ‌డానికి పాల‌మూరు ఎత్తిపోత‌ల పెట్టుకున్నాం. ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ మ‌న కోస‌మే నిర్మించుకున్నామ‌ని చెబుతున్న బీఆర్ నేత కాసాని గెలుపుపై ధీమాగా వున్నారు.
Publish Date: Apr 23, 2024 6:21PM

పేద, మధ్యతరగతి వారికి హెచ్చరిక!

ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే. ఇక్కడ పేర్కొన్న వర్గాలకు చెందిన వారు ఈ వారం పది రోజులపాటు రాజకీయ నాయకులకు సంబంధించిన అఫిడవిట్లను వివరాలను చూడటం మానేస్తే మంచిది. ఎందుకంటే, రాజకీయ నాయకుల నేరాల చిట్టా చూసి మనసు బాధపడుతుందని కాదు.. వాళ్ళకున్న ఆస్తులను చూసి గుండెలు అవిసిపోతాయి కాబట్టి. ముఖ్యంగా నెల జీతంతో జీవితాలను నెట్టుకొచ్చే వారి హృదయాలు ఎవరో పిడికిలితో పిండేసినట్టు తల్లడిల్లిపోతాయి కనుక. దేశంలో చాలామంది జనం నెలకు 20 వేలు సంపాదించాలంటే అడ్డమైన గడ్డి కరవాల్సి వస్తోంది. అలాంటి రాజకీయ నాయకులకు ఈ ఆస్తులేంటండి బాబు.. గతంలో నాయకుల ఆస్తుల వివరాలు రెండు కోట్లు, మూడుకోట్లు అని చదివి అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడో... వందల కోట్లు, వేల కోట్లు.. పేర్లెందుగానీ, ఒక మనిషికి ఐదువేల కోట్లు, ఆరువేల కోట్లు ఆస్తుంలేంటండీ బాబు! కొంతమంది నాయకులు పెద్దలు సంపాదించిన వందలు, వేల కోట్లకు తాము సంపాదించిన మరిన్ని కోట్లు కలుపుతున్నారు. కొంతమంది సొంతగానే వేలకు వేల కోట్లు సంపాదిస్తున్నారు. స్థిరాస్తుల వివరాల్లో చూపించే అంకెలు కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే. రిజిస్ట్రేషన్ వాల్యూతో లెక్కేస్తేనే అంతేసి వాల్యూ వుంటున్నాయంటే, ఆయా స్థిరాస్తుల అసలు విలువ ఎంత వుంటుందో ఊహించాలంటే భయం వేస్తుంది.  ఈ వందలు, వేల కోట్ల ఆస్తుల గురించి చూసి ఇన్‌స్పిరేషన్ పొంది బడుగు జీవులు కూడా అన్ని కోట్లు సంపాదించే ఛాన్స్ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే ఆ ఆస్తులను చూసి మానసికంగా క్రుంగిపోవడం మాత్రం ఖాయం. అందరూ మనుషులమే కదా.. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? మనలో వున్న లోపం ఏంటి అని బాధపడి అల్లాడిపోవడం తథ్యం. అంచేత ఆ ఆస్తుల వివరాలను చూసి మనసు పాడు చేసుకోకుండా వుంటే మంచిది కదా!
Publish Date: Apr 23, 2024 5:43PM

ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడి నామినేషన్

ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే  అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా? అంటే ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా అధికారికంగా ఇంకా ప్రకటించకుండానే  మంగళవారం ( ఏప్రిల్ 23) రామ సహాయం రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేయడాన్ని బట్టి ఔననే భావించాల్సి వస్తున్నది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఖమ్మం బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామ సహాయం రఘురాంరెడ్డి స్వయంగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం గమనార్హం. ఇక చివరి నిముషం వరకూ ఈ నియోజకవర్గ అభ్యర్థి రేసులో పొంగులేని సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులో నిలిచారు. ఈ పంచాయతీ హైకమాండ్ వరకూ కూడా వెళ్లింది. ఇరువురి మధ్యా రాజీ కోసం కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఇరువురికీ నచ్చచెప్పారు. అయితే ఎవరికి వారు తమ వారికే టికెట్ ఇవ్వాలంటూ పట్టబట్టడంతో మధ్యే మార్గంగా రామ సహాయం రఘురాంరెడ్డికి ఖమ్మం లోక్ సభ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు. రామ సహాయం రఘురాంరెడ్డి సామాన్యుడేం కాదు. ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే. ఆయన తండ్రి  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  రామసహాయం సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి పలు మార్లు  ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు, పేరు ఉంది. వయోభారం కారణంగా ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఆయన కుమారుడికే ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. ఇటు పొంగులేటి, అటు భట్టి నొచ్చుకోకుండా కాంగ్రెస్ మధ్యేమార్గంగా రఘురాం రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చింది. రామసహాయం రఘురాంరెడ్డికి రాజకీయ, సినీ రంగాలతో మంచి అనుబంధం ఉంది.   హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు అయ్యారు. అటువంటి రఘురాంరెడ్డిని ఖమ్మం అభ్యర్థిగా ఖరారు చేయడం ద్వారా పార్టీలో ఎటువంటి అసమ్మతి, అసంతృప్తి తలెత్తకుండా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత కనిపిస్తోంది. ఆ ఐక్యత ఖమ్మం సీటు కారణంగా చెడకుండా ఉండేలా కాంగ్రెస్ హైకమాండ్ అన్ని  జాగ్రత్తలూ తీసుకుంటోందని ఖమ్మం సీటు విషయంలో వ్యవహరించిన తీరును బట్టి అర్ధం అవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ వెనుక పొంగులేటి , భట్టి విక్రమార్కల కృషి ఎంతో ఉంది. జిల్లాలో ఇద్దరూ ప్రముఖ నేతలే కావడంతో ఇరువురికీ ఇబ్బంది లేకుండా ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కూడా పార్టీ హైకమాండ్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాలను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇహనో ఇప్పుడో అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన రావడానికి ముందే ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచార రాజేందర్ రావులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం మీద నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గుడువు ఉండగానే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్ధానాలకూ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. 
Publish Date: Apr 23, 2024 5:25PM

ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటించని బీజేపీ!

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది. కాంగ్రెస్ పార్టీ అడ్డదిడ్డంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, బీజేపీ దానికి మద్దతు ఇచ్చింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రత్యేకహోదా హామీని అయినా నెరవేర్చండయ్యా బాబూ అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎంత మొత్తుకున్నా బీజేపీ ప్రభుత్వం కరుణించలేదు. ఆ కారణంతోనే బీజేపీ, టీడీపీ మధ్య దూరం పెరిగింది. చివరికి స్నేహం ముగిసింది. కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం రావాలన్న ధ్యేయంతో వున్న బీజేపీ ఈసారి అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు స్నేహహస్తం చాచింది. మొత్తానికి పొత్తు కుదిరింది. మూడు పార్టీలతో కూటమి ఏర్పడింది. బీజేపీ తన స్థాయికి మించిన విధంగా స్థానాలను పొందింది. బీజేపీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ తనకు పట్టున్న అనేక స్థానాలను బీజేపీకి అప్పగించింది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా కావచ్చు, అనేక రాజకీయ అంశాల పరంగా కావచ్చు టీడీపీ, జనసేన పాటిస్తున్న పొత్తు ధర్మాన్ని బీజేపీ పాటించడం లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, కూటమిది పై చేయి అయితే కూటమితే, వైసీపీది పై చేయి అయితే వైసీపీతో ప్రయాణం చేస్తే ఓ పనైపోతుంది బాబూ అన్న ధోరణిలోనే బీజేపీ వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమితో వున్నప్పటికీ బీజేపీకీ, వైసీపీకి లోపాయకారీగా ‘ఏదో’ వుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.  400 వందల సీట్లతో విజయం సాధించాలని కలలు కంటున్న బీజేపీకి, ఈసారి అధికారం దక్కుతుందా లేదా అనే భయం కూడా వుంది. అందుకే అవకాశం వున్న ఏ పార్టీనీ దూరం చేసుకునే ఉద్దేశంలో లేదు. అందుకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని, వైసీపీతో సీక్రెట్ స్నేహం నడుపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే, జగన్‌కి గాయం అయిందన్న వార్త ఇలా బయటకి వచ్చిందో లేదో, ఎక్కడో ఢిల్లీలో వున్న ప్రధాని మోడి తల్లడిల్లిపోయి తన రియాక్షన్‌ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలాంటి నాటకాలు ఆడటంలో జగన్ సిద్దహస్తుడని ఆల్రెడీ గత ఎన్నికల సందర్భంగా ప్రూవ్ అయింది. అలాంటి సంఘటనే మరోసారి జరిగినప్పుడు ఆచితూచి స్పందించాల్సిన బాధ్యత ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తికి వుండాలి కాదా. అలాంటిదేమీ పాటించకుండా జగన్ మీద ప్రేమ కురిపించేశారు.  ఈ విషయంలో కొంతమంది బీజేపీ నాయకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంలో వివరణ ఇస్తున్నారు. జగన్ మీద నిజంగానే హత్యాయత్నం జరిగిందని ప్రధానమంత్రి భావించారని, అందుకే అంత స్పీడుగా స్పందించారని, ఆ తర్వాత ఇదంతా ఒక డ్రామా అని అర్థం చేసుకుని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే, జగన్ ఆడిన డ్రామాని తెలుగుదేశం, జనసేన వర్గాలు నాన్ స్టాప్‌గా విమర్శిస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి అలాంటి విమర్శలేవీ లేవు. జగన్ ఆడింది డ్రామా అని తెలిసినా, ఇది డ్రామా అని ఒక్క బీజేపీ నాయకుడి నోటి నుంచి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూటమిలో వున్న మూడు పార్టీలు ఒకే మాట మీద వుండటం అనేది పొత్తు ధర్మం. కానీ బీజేపీ ఆ ధర్మాన్ని విస్మరించింది. ‘ధర్మం’ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ పొత్తు ధర్మాన్ని ఎందుకు విస్మరిస్తోందో!
Publish Date: Apr 23, 2024 4:49PM

కడప కోర్టు తీర్పుపై సుప్రీంకు బీటెక్ రవి

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు. ఈ మేరకు బీటెక్ రవి తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి, పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు భగం వాటిల్లేలా ఉన్నాయని బీటెక్ రవి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 24)న విచారణ జరపనున్నట్లు తెలిపింది.  అవినాష్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో వివేకాహత్యకు సంబంధించి తనపై కేసులు ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా సీబీఐ చార్జిషీట్ ఆధారంగా అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చార్జిషీట్ లోని అంశాలను కూడా ప్రస్తావించకుండా కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇవ్వడంపై న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తారు. కడప కోర్టు ఉత్తర్వులపై సునీత కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసకోనున్నదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  
Publish Date: Apr 23, 2024 4:33PM

ఇంతకీ తమ్మినేని చదువు కున్నారా?.. చదువు కొన్నారా? ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చెప్పిందేమిటి?

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ  బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు,  ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా,  రాజకీయ నాయకుల విధ్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి.  ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ..మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  డిగ్రీ  విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారం పేరు కూడా చేరింది.  ఆయన డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే ఇప్పుడు స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అంగీకరించారు. అంగీకరించడమంటే మౌఖికంగా చెప్పడం కాదు.. ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు.    తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పి హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశంపై పెద్ద దుమారం కూడా రేగింది. అదలా ఉండగానే ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని గత కొంత కాలం కిందట తెలుగుదేశం బయట పెట్టింది.  దీనిపై కిమ్మనని తమ్మినేని ఇప్పుడు తాను డిగ్రీ పూర్తి చేయలేదంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లా కాలేజీలో అడ్మిషన్ ఎలా లభించింది. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి ఉంటే చట్టపరంగా చర్యలకు రెడీ అవ్వాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Apr 23, 2024 3:13PM