స్పెషల్ ఫ్లైట్‌ లో షికార్లు..కారులో కవాతులు

 

పవన్ కళ్యాణ్ చేసింది ఏ వ్యాఖ్య అయినా దానికి ప్రతి విమర్శ చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ.అంతకుముందు కవాతు సందర్బంగా పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన యామినీ ఆయన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.తాజాగా ‘తితలీ’ తుఫానుతో అతలాకుతలమైన సిక్కోలులో పర్యటిస్తున్న పవన్ ట్విట్టర్ వేదికగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సౌకర్యం లేదని.. దయచేసి ఈ విషయాన్ని కాస్త పట్టించుకోండి సీఎం గారు అని కోరారు. ఇందుకు స్పందించిన టీడీపీ మహిళా నాయకురాలు యామినేని సాధినేని ఇప్పటివరకు కరెంటు ఎందుకు ఇవ్వలేదంటూ పవన్ దిగజారుడు ట్వీట్... దానికి ఆధారాలతో సహా సమాధానం ఇదే అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు.

 

 

"శ్రీకాకుళం తుఫానుపై రాజకీయ దాడి మొదలైంది. తుఫాను కొట్టిన నాలుగు గంటల్లోనే చంద్రబాబు తన క్యాబినెట్ మొత్తాన్ని పలాసకు మార్చి.. అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికి 7రోజులు అయ్యింది. చంద్రబాబు అంతకు ముందు రోజు నుంచే.. తుఫాను ప్రభావం అంచనా వేస్తూ, తగు ఆదేశాలు ఇస్తూ, తుఫాను వచ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా అప్రమత్తంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా శ్రీకాకుళంలోనే పని చేస్తూ పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వమే ఇంత ఇదిగా పని చేస్తే.. ఇక ప్రతిపక్షం ఇరగబడి పని చెయ్యాలి. కానీ మన ఖర్మకు ఒక నాయకుడు హైదరాబాద్ పోయాడు. ఇంకొకరు స్పెషల్ ఫ్లైట్‌లలో తిరుగుతూ కారులో కవాతులు చేసుకుంటూ తీరిగ్గా ఆరు రోజుల తరువాత వచ్చాడు. సరే వచ్చాడు. ఆయనకు చేతనైన సహాయం చెయ్యాలి.. లేకపోతే లోపాలు ఉంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఎక్కడ ప్రజలకు ఉన్న ఇబ్బంది ఉందో చెప్పాలి. నిన్న ఒక రెండు గంటలు తిరిగాడు. పేపర్‌లో ఏదో రాసుకుని ఈ రోజు మరో రెండు గంటలు తిరిగాడు. ఇక ట్విట్టర్ వేదికగా రాజకీయ దాడి మొదలు పెట్టాడు. ముందుగా తెలుగుదేశం పార్టీని నేనే గెలిపించా అని ట్వీట్ మొదలు పెట్టి.. మీ అంతు చూస్తా అని అన్నాడు. తరువాత కరెంటు విషయంలో ఇప్పటికీ ఆరు రోజులు అయ్యింది.. కరెంటు ఎందుకు రాలేదు అంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసాడు పవన్. నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ అవమానించేది చంద్రబాబుని కాదు.. గ్రౌండ్‌లో పని చేసే కొన్ని వేల మంది స్టాఫ్‌ని.. పవన్ చౌకబారు ఆరోపణకుఆధారాలతో సహా సమాధానం ఇది" అని పవన్‌కు యామినీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
 


"ఇరవై-ముఫై సంవత్సరాల నుండి వేసుకున్న విద్యుత్ వ్యవస్థ మొత్తం తిత్లీ దెబ్బకు కకావికలం అయిపోయింది. 30 వేల కరెంటు స్థంబాలు పడిపోయాయి. మీరోచ్చి ఆరు రోజులైనా పునరుద్ధరించలేదని ఆరోపణలు చేస్తున్నారు. 7వేల మంది సిబ్బంది రాత్రనకా, పగలనకా దసరా లాంటి పెద్ద పండగలను, పెళ్ళాంబిడ్డలనొదిలేసి కష్టపడి పనిచేస్తున్నారు. మీరు తీరిగ్గా కవాతులు, బలప్రదర్శనలు పూర్తి చేసుకోని వచ్చి ఒకపూట, ఒక మూల తిరిగి నోటికొచ్చినట్లుగా మాట్లాడతారా? ఇంటికి కరెంట్ రావాలంటే ముందు 33కేవీ లైన్లు, తర్వాత 11కేవీ లైన్లు సరిచెయ్యాలి. ట్రాన్స్‌ఫార్మర్ పోల్స్ కూడా పడిపోయే.. అవి నిలబెట్టాలి. అప్పుడు ఎల్టీ లైన్లు సరి అవుతాయి. అవి అన్నీ సరి చెయ్యాలంటే ఏదో ఒకటి రెండు రోజుల్లో మీరు సినిమాలో వేసిన సెట్‌లా అయిపోదు. ఇప్పటికే దాదాపుగా 85 శాతం కరెంటు ఇస్తున్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయి. అవి కూడా మరో, నాలుగు అయిదు రోజులలో పూర్తవుతాయి. మీ రాజకీయ ప్రచారం కోసం కష్టపడి పని చేసే వారిని, తక్కువ చేసి మాట్లాడకండి. చేతనైతే సహాయం చెయ్యండి. లేకపోతే కవాతులు చేసుకోండి" అని యామినీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.