పవన్‌కు పాజిటివ్‌.. ఊపిరితిత్తుల్లో నిమ్ము.. ఫ్యాన్స్ కంగారు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు.  ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆయనకు చికిత్స చేస్తున్నారు. 

‘‘ఈనెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. అయినా, వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్‌ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో చికిత్స అందిస్తున్నారు.’’ అంటూ జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 

‘‘పవన్‌కల్యాణ్‌కు పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు పవన్‌ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు’’ అని జనసేన పార్టీ తెలిపింది.