చంద్రబాబుపై పవన్ కొత్త స్కెచ్..!!
posted on Sep 24, 2018 2:44PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుస యాత్రలు, ప్రభుత్వం మీద విమర్శలతో హడావుడి చేసారు. అయితే గత కొద్దిరోజులగా మౌనంగా ఉన్న ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గరకు చేరుకొని రొట్టెల పండగలో పాల్గొనడం. మరోవైపు తరువాతి యాత్రల డేట్ లను అధికారికంగా ప్రకటించడం. దీంతో అభిమానులు పవన్ జోరు మళ్ళీ మొదలైంది అంటూ సంబరపడిపోతున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదంతా బీజేపీ, జనసేన కలిసి వేస్తోన్న స్కెచ్ ఆరోపణలు చేస్తున్నారు.
ఆపరేషన్ డైవర్షన్ లో భాగంగా చంద్రబాబు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే రోజు.. పోలవరం వెళ్లి విమర్శలు చేయడానికే పవన్ రంగంలోకి దిగుతున్నారని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఐక్యరాజ్యసమితిలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం ఉన్న నేపధ్యంలో.. జాతీయ స్థాయిలో బాబుపై ఫోకస్ పడింది. దీనిని డైవర్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ను బీజేపీ అధిష్టానం మళ్ళీ రంగంలోకి దించిందని సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాదు పవన్ అడుగులనే ఉదాహరణగా చూపిస్తూ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నారు. గతంలో కూడా కేంద్రంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్న సమయంలోనే పవన్ విరుచుకుపడడం.. అలాగే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు, లోకేష్ లు అవినీతి చేసేసారంటూ పవన్ విమర్శించడం.. ఇలాంటి సంఘటనలు గుర్తుచేస్తూ తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం పవన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంతో కాలమే నిర్ణయించాలి.