ఆ లేఖ నన్ను కదిలించింది.. అందుకే రూ.కోటి ఇచ్చా: పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్.. ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్‌ ఫోర్స్‌ బ్యాడ్జీతో పవన్‌ను సైనిక అధికారులు గౌరవించారు. 

అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... సైనిక్ బోర్డుకు సహాయం అందించాలంటూ బ్రిగేడియర్‌ వీరేంద్ర కుమార్ రాసిన లేఖ తనను కదిలించిందని తెలిపారు. అందుకే తన వంతు సహాయంగా కోటి రూపాయలు అందించానని చెప్పారు. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు అన్నారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరూ సైనిక్ బోర్డ్‌కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన సాయం సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని పవన్‌ తెలిపారు.