రాజధాని వివాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు... కేంద్రం కల్పించుకోవాలని డిమాండ్‌....

అమరావతి రైతులు, మహిళల ఆందోళనలకు జనసేనాని పవన్ కల్యాణ్‌ సంఘీభావం తెలిపారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన నేతలతో సమావేశమైన పవన్‌ను అమరావతి రైతులు కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా రాజధాని రైతులతో సమావేశమైన జనసేనాని.... రాజధాని తరలింపపై కీలక వ్యాఖ‌్యలు చేశారు. ఏపీ రాజధాని వివాదంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

అలాగే, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని జనసేనాని గుర్తుచేశారు. అలాగే, ఏపీ రాజధాని వివాదంపై బీజేపీ, కాంగ్రెస్‌ తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు... తమకు అన్యాయం జరుగుతుందని పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారని.... వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.