అనంతలో పవన్ మీటింగ్... అప్పుడే హడావుడి...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం అనంతపురం ప్రభుత్వ కళాశాల వేదికగా ప్రసంగం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక హోదాపై కాకినాడ ప్రసంగంలో సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు ఈ ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా ఉదయం నుంచే సందడి మొదలైంది. ఇప్పటి నుంచే అభిమానులు కళాశాలకు చేరుకుంటున్నారు. దీంతో పట్టణ వ్యాప్తంగా పవన్ ఫీవర్ నెలకొంది. ఇంకా ఈ సభకు వీఐపీలకు ప్రత్యేక గాలరీ ఏర్పాటు చేశారు. ఎప్పటిలానే సభా వేదికపై పవన్‌ కల్యాణ్‌ ఒకరే ఉంటారని తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు ఆయన ప్రసంగం సాగుతుంది. మైదానంలో రెండు, బయట మూడు పెద్ద ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఇక ఈ సభా వేదికకు వెళ్లేందుకు నాలుగు దారులుండగా, ప్రధాన రహదారిని వీఐపీల కోసం కేటాయించారు. మిగతా గేట్లు అభిమానులు, కార్యకర్తల కోసం కేటాయించారు. మొత్తం 800 పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించిన పోలీసు శాఖ, మరో 300 మందిని రిజర్వులో ఉంచింది.