వైజాగ్ చేరుకొన్న పవన్ కళ్యాణ్

 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు కొద్ది సేపటి క్రితమే చేరుకొన్నారు. ఆయనకు వైజాగ్ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ మొదట తన అభిమానులతో, హైదరాబాదు నుండి వచ్చిన తన ప్రతినిధులతో సమావేశమవుతారు. తమ అభిమాన హీరోతో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతున్న అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం భోజనానంతరం సిటీలో జరుగబోయే ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ అందుకు పోలీసులు అనుమతించవలసి ఉంది. ఒకవేళ వారు అనుమతించినట్లయితే ఆయన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. లేకుంటే సాయంత్రం సభ మొదలయ్యే వరకు చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చిన అభిమానులతో పార్టీ నిర్మాణం గురించి, ఇతర విషయాల గురించి చర్చించి సాయంత్రం నేరుగా సభకు రావచ్చును.

 

ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాల నుండి ఆయన అభిమానులు భారీ ఎత్తున సభాస్థలికి (ఇందిరా ప్రియదర్శిని స్టేడియం) చేరుకొంతున్నారు. వైజాగ్ నగరంలో అప్పుడే పవన్ కోలాహలం మొదలయిపోయింది. ఎక్కడ చూసినా కుర్రకారు, జనసేన లోగో ఉన్న టీ షర్టులు ధరించి, బైకులకు జనసేన జెండాలు తగిలించుకొని కేరింతలు కొడుతూ రివ్వు రివ్వున దూసుకుపోతూ చాలా హడావుడి చేస్తున్నారు.