పాకిస్థాన్లో శుభకార్యాలకు మీరు వెళ్తారు.. వెంకయ్య ఆగ్రహం..
posted on Nov 17, 2016 2:59PM
రాజ్యసభలో నోట్ల రద్దుపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపాలని.. మోడీ దీనిపై ఖచ్చితంగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. గులామ్ నబీ ఆజాద్ నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. యూరీలో పాక్ ఉగ్రవాదుల వల్ల మరణించిన వారికంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు వల్ల మరణాలు ఎక్కువయ్యాయని ఆజాద్ ఘాటుగా ఆరోపిణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చేంత వరకు నోట్ల రద్దు అంశంపై చర్చ జరగరాదని ఆజాద్ డిమాండ్ చేశారు.
ఇక ఈ చర్యను పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోల్చినందుకు గాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత దేశాన్ని అవమానించారని మండిపడ్డారు. ఇక వెంకయ్య మాటలకు మళ్లీ కల్పించుకున్న ఆజాద్.. పాకిస్థాన్లో పెళ్లిలు, శుభకార్యాలకు మీరు వెళ్తారని, వాళ్లకు రెడ్ కార్పెట్ కూడా వేస్తారని, అలాంటి మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని అన్నారు. దీంతో సభలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది.