శీలానికి ఖరీదు కట్టారు... దుర్మార్గులు...

 

మహిళ శీలానికి ఖరీదు కట్టే షరాబులు ఈమధ్య బాగా పెరిగిపోయారు. ఆటవిక రాజ్యం నడిచే బీహార్‌ రాష్ట్రంలో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా గ్రామానికి చెందిన ఒక మహిళ మీద ప్రకాష్, రవిదాస్ అనే వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకుని పారిపోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారిద్దరూ పోలీసులను ‘మేనేజ్’ చేసే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళి బాధితురాలికి డబ్బు ఇచ్చి నోరు మూయించే ప్రయత్నం చేశారు. డబ్బు తీసుకోవడానికి, కేసును ఉపసంహరించుకోవడానికి ఆ మహిళ నిరాకరించడంతో ఆ రేపిస్టులిద్దరికీ కోపం వచ్చింది. ఆమె భర్త మీద కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. పోలీసులు, పంచాయితీ పెద్దలు రేపిస్టులతో గొడవ సెటిల్ చేసుకొమ్మని ఉచిత సలహా ఇచ్చారు. దాంతో ఆ ఇద్దరు రేపిస్టులు ఆ మహిళకు 41 వేల రూపాయలు ఇస్తామని, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పారు. ఈ అంశం మీద ఆ మహిళ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో వుంది.