ఒక కుటుంబం.. 47 ఓట్లు!

 

అసలే ఎన్నికల వేళ.. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయని తెలిస్తే చాలు.. అభ్యర్థులంతా వారింటికి వెళ్లి, ఆ ఓట్లు సంపాదించడానికి నానా పాట్లూ పడతారు. అలాంటిది ఒకే ఇంట్లో ఏకంగా 47 ఓట్లుంటే.. నేతల ప్రయత్నాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. బీహార్ లోని కిషన్‌గంజ్ నియోజకవర్గంలో 85 మందితో ఉన్న ఓ ఉమ్మడి కుటుంబానికి ఇదే కారణంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. పుర్నియా జిల్లాలోని జియాగచ్చి గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. 55 మంది పురుషులు, 30 మంది మహిళలు, 35 మంది చిన్నపిల్లలు ఉన్న ఆ అవిభాజ్య కుటుంబంలో 47 మందికి ఓటు హక్కు ఉంది. అంతే.. ఈ విషయం తెలుసుకున్న వివిధ పార్టీల అభ్యర్థులు వారి ఇంటికి క్యూలు కడుతున్నారు. ఆ 47 ఓట్లూ తమ ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ‘‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో మా కుటుంబం నుంచి 47 మంది ఓటు వేయనున్న నేపథ్యంలో మాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది’’ అని ఆ కుటుంబ పెద్ద మహ్మద్ న జీర్ తెలిపారు.