నేటి నుండి ఏపీ యన్.ఐ.టి. క్లాసులు ప్రారంభం
posted on Sep 11, 2015 9:40AM
రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా సంస్థలను కేంద్రప్రభుత్వం నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇంతవరకు రాష్ట్రంలో ఐదు ఉన్నత విద్యా సంస్థలకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శంఖు స్థాపననలు చేసారు. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్నాలాజీ (యన్.ఐ.టి.) కూడా ఒకటి. కానీ ఈ ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ శావిత భవన సముదాయాలు నెలకొల్పడానికి చాలా సమయం పడుతుంది కనుక అంత వరకు తాత్కాలికంగా వేరే సంస్థల భవనాలలో ఈ విద్యా సంవత్సరం నుండే శిక్షణా తరగతులు మొదలుపెడుతున్నారు. ఏలూరులోని పెద్ద తాడేపల్లి గ్రామంలో గల వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో నేటి నుండి యన్.ఐ.టి. శిక్షణా తరగతులు మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు నిన్న ఆ భవన సముదాయాన్ని, శిక్షణా తరగతులను లాంఛనంగా ఆరంభించారు. దీనికి వరంగల్ యన్.ఐ.టి. మార్గదర్శకత్వం చేస్తుంది. విశాఖ శివార్లలో గంభీరం అనే గ్రామంలో నెలకొల్పుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐ.ఐ.ఎం.) శిక్షణ తరగతులు ఆంద్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించబోతున్నారు. దీనికి చెన్నై ఐ.ఐ.ఎం. మార్గదర్శకత్వం చేస్తుంది.