అవినీతి, కులం, కుటుంబం కోరల్లో చిక్కుకున్న ఏపీ.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

ఎన్నో ప్రకృతి వనరులు ఉండి ఎంతో అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ వంటి బలమైన రాష్ట్రం అవినీతి, కుటుంబం, కులం వంటి రాజకీయ సమస్యలతో అభివృద్ధి లేక కునారిల్లుతోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మోడీ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనసంవాద్ ర్యాలీలో పాల్గొన్న ఆమె ఏపీ ప్రస్తుత పరిస్థితి పై ఈ వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఇటువంటి అభివృద్ధి నిరోధక ధోరణి పై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

గత ఆరేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగ పడే కిసాన్ సమ్మాన్ యోజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పై దర్యాప్తు చేస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. అదే సమయంలో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం వరల్డ్ బ్యాంక్, ఎడిబి వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకుని తెచ్చిన ప్రాజెక్టుల విషయంలో ఒప్పందాలు అమలు చేయకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు. కారణాలేవైనా కానీ అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేస్తే (పీపీఏ ల రద్దు) రాష్ట్రానికే కాక దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆమె అన్నారు. ఎన్నికల టైం లో వాగ్దానం చేశామని ఇలా అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయడం సరి కాదని ఆమె అన్నారు.

ఇదే సమయంలో కేంద్రం రూ 2.70 కే కరెంట్ ఇస్తుంటే రాష్ట్రం మాత్రం రూ 9 వసూలు చేస్తోందని చెపుతున్నారని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంట ధర పెట్టి కరెంట్ కొని వ్యాపారం చేయడమా సాధ్యమేనా అని ఆమె వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా పై పోరాటానికి కేంద్రం ఏపీకి 8,025 కోట్లు ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మిత్ర పక్షమైన జనసేన ను పవన కళ్యాణ్ ను ఆమె ప్రశంసించారు.