క్యాష్ బ్యాక్.. అమ్మఒడి పేరుతో ఇచ్చిన డబ్బు నుండి రూ.1000 తిరిగి ఇవ్వాల్సిందే!
posted on Jan 28, 2020 2:43PM
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి పథకం రివర్స్ సీన్ మొదలైంది. పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో రూ.15,000 రూపాయలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విరాళం సాకుతో అందులో రూ.1000 రూపాయలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. దీన్ని ఆప్షన్ గా కాకుండా తప్పని సరి చేస్తూ తాజాగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
జనవరి 9వ తేదీన చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లుల నుంచి వెనక్కి తీసుకునే వెయ్యి రూపాయలతో రాష్ట్రం లోని 44,570 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరచాలని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. స్కూళ్ల లోని బాత్రూమ్ లు శుభ్రం చేసే ఆయాలకు నెలకు రూ.4000 వేతనంగా ఇవ్వాలని అలాగే బ్రష్ లు, చీపుర్లు , ఫినాయిల్ కు నెలకు అయ్యే రూ.2000 రూపాయలను కాంపోజిట్ గ్రాంట్ కింద ఖర్చు పెట్టుకునేలా ఈ సర్క్యులర్ జారీ చేశారు.
తల్లులందరి నుంచి జమ చేసిన సొమ్ముతో పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు పారిశుధ్య నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రధానోపాధ్యాయులు ఈ నెల 30 న తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించి.. వారిని చైతన్యపరచాలి. సమావేశానికి హాజరైన వారు తమ వంతు విరాళంగా రూ.1000 రూపాయలను తల్లిదండ్రుల కమిటీకివ్వాలని అభ్యర్థించాలి. తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు జమ చేసిన సొమ్ముని జిల్లా స్థాయిలో డీఈవో ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు జమ చేయాలి.
పాఠశాల కమిషనర్ ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. చాలా చోట్ల ఇప్పటి వరకు ఎంతమందికి అమ్మఒడి నగదు పడిందో స్పష్టత లేదు. ఇప్పటికే నగదు జమ కాలేదని చాలా మంది తల్లితండ్రులు ప్రధానోపాధ్యాయులను నిలదీస్తున్నారు. ఈ నేపధ్యంలో అమ్మఒడి లబ్దిదారుల నుంచి వెయ్యి రూపాయల వసూలు చేయాలని చెప్పడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఒకసారి డబ్బు చెల్లించాక మళ్లీ కొంత ఇచ్చేయాలని అడిగితే ఎవరూ ముందుకు రారని, ఇది సాధ్యమయ్యే పని కాదని మండిపడుతున్నారు. పైగా ఫిబ్రవరి ఒకటి నుంచి బాత్రూంల నిర్వహణ అమలు చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ ఒడి లబ్దిదారులు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల లో కూడా ఉన్నారు. ఆ పాఠశాలల్లో పిల్లల ఫీజులలోనే అన్ని రకాల నిర్వహణ ఖర్చులు కలిపి వసూలు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో లబ్ధిదారుల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకోవడం మినహా ఎలాంటి నిర్వహణ ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.