టీడీపీలోకి ఆనం వివేకానందరెడ్డి?

 

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాస్తంత నోరున్న, ప్రజల్లో బలమున్న నాయకుడు ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో గెలిచే అవకాశం వున్న నాయకుడు అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో వున్న పాపానికి ఆనం వివేకానందరెడ్డి ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోర తప్పిదం చేసిందని ఆయన భయపడకుండా విమర్శిస్తూ వుంటారు. మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం చేద్దామని పిలుపు ఇస్తే, ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ నాయకులకు తన మాటలతో తలంటు పోశారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయండిగానీ, రాజకీయాల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయొద్దని ఆయన ఘాటుగా అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శనివారం నాడు కలిశారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలసి ఆయన చంద్రబాబును కలిశారు. దీంతో ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.