విశాఖలో రాజధానిపై నేవీ క్లారిటీ.. అలాంటి ప్రతిపాదన రాలేదని ప్రకటన

విశాఖలో ఏపీ కార్యనిర్వాహక రాజధాని దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు నేవీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలను తూర్పు నావికా దళం ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సచివాలయం ఏర్పాటు కోసం తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని, దానికి తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని వివరణ ఇచ్చింది. దీంతో విశాఖలో నేవీ అభ్యంతరాల వార్తలకు బ్రేక్ పడినట్లయింది.

వాస్తవానికి విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సచివాలయానికి ప్రతిపాదిస్తున్న మిలీనియం టవర్స్ పై నేవీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఐఎన్ఎస్ కళింగ పరిధిలోకి వచ్చే మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేస్తే రాకపోకలు పెరుగుతాయని దీంతో భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా నేవీ ఇచ్చిన వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది.