బీజేపీ కి షాక్..కాంగ్రెస్ వైపు మోడీ డూప్

 

ఆయన అచ్చం ప్రధాన మంత్రి మోడీలా ఉంటారు.గత ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం కూడా చేసారు.కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తా అంటున్నారు.ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన అభినందన్‌ పాఠక్‌.మోదీనేన అనుకునేంత దగ్గర పోలికలు ఉండటంతో 2014 లో బీజేపీ ఆయనతో ప్రచారం కూడా చేయించింది.అయితే భాజపా వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని, మోదీ అనుకున్నట్లుగా భాజపా పనిచేయడం లేదని, ఆ పార్టీలోని నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని అభినందన్ ఆరోపించారు.అందుకే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నానని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బార్‌ను కలిసి మాట్లాడానని ఆయన చెప్పారు.అయితే మోడీ పట్ల తనకు వ్యతిరేకత లేదని, మోడీ భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలని చూస్తున్నారని అభినందన్‌ పేర్కొన్నారు.తన సమస్య భారతీయ జనతా పార్టీతోనే అని స్పష్టంచేశారు.ప్రజలు తన దగ్గరికి వచ్చి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారని, కొందరు తనను కొట్టారని, నిందించారని తెలిపారు.