అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ 

ఈఎస్ఐ అవినీతి ఆరోపణల కేసులో ఎసిబి అరెస్ట్ చేసిన టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఈ రోజు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. టీడీపీ పార్టీ తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి ఆయన భరోసా ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు వచ్చిన లోకేష్‌ ముందుగా ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తరువాత అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అచ్చెన్న గురించి ఆందోళన పడవద్దని.. పార్టీ అన్ని విధాలా వారికీ అండగా ఉంటుందని అయన చెప్పారు. లోకేష్ వెంట ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహణ్ నాయుడు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ను ఏసీబీ అధికారులు ఆస్పత్రిలోనే విచారిస్తున్నారు. గురువారం 3 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు.. ఈ రోజు, రేపు కూడా విచారించనున్నారు.