అసెంబ్లీ సాక్షిగా బీజేపీకి లోకేష్ పంచ్..!!

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. వైసీపీ సమావేశాలకు దూరంగా ఉండటంతో బీజేపీ ప్రతిపక్షం లా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీనిలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ముందుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ నిజాయితీగా పనిచేస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు.. ఎన్ఆర్ఈజీఏ గురించి మంత్రి నారా లోకేశ్ మాట్లాడుంటే బాగుండేదన్నారు.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోకల్లా అత్యధికంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.. కేంద్రంలోని రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్, ప్రధాని మోదీ నిష్పక్షపాతంగా రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేయచ్చో, అలా మేలు చేయడానికి ఎన్ఆర్ఈజీఏ ద్వారా పలు ప్రయత్నాలు చేస్తున్నారు.. లోకేష్ మంచి పనులు చేశారని తానెలాగైతే మెచ్చుకుని ధన్యవాదాలు చెప్పానో, అలాగే మంచి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెబితే బాగుంటుందని లోకేష్ కు మాణిక్యాల రావు సూచించారు.. దీనిపై స్పందించిన లోకేష్.. బీజేపీకి చెందిన నేతలు అస్తమానం కేంద్రానికి లెటర్లు రాస్తున్నారు.. అవినీతి జరిగిపోతోంది, నీరు చెట్టుకు నిధులు డైవర్ట్ చేస్తున్నారని పదే పదే చెబుతున్నారు.. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడా అవినీతి జరగట్లేదు.. కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వమే మాకు క్లీన్ చిట్ ఇచ్చింది.. అకౌంటబిలీటి ట్రాన్‌స్పిరెన్సీలో గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు సార్లు ఏపీ మొదటి స్థానంలో ఉంది.. బీజేపీ వాళ్లే కాదు, వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేంద్రానికి లేఖలు రాశారు.. కేంద్రానికి పదేపదే ఇలా లేఖలు వస్తుండటంతో సందేహించి చాలా ఆడిట్ టీమ్‌లను పంపింది.. ఇప్పటికీ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నూటికి నూరుశాతం ఆడిట్ అయ్యాయి.. ఆ తర్వాత వచ్చిన ఆడిట్ టీమ్ కూడా ఏపీలో ఎలాంటి అవకతవకలు జరగట్లేదని అని తేల్చిచెప్పేసింది.. కేంద్ర మంత్రి తోమర్, యంగ్‌ మినిస్టర్‌గా మంచి పనులు చేస్తున్నావని నన్ను మెచ్చుకున్నారు.. అవసరమైతే ఇంకా ఎక్కువగా నిధులు ఇస్తానని కూడా ప్రోత్సహించారు.. ఇది ఆన్ రికార్డ్‌గా చెబుతున్నాను అని లోకేష్ వివరించారు.