కోర్టుకెళ్లిన నన్నపనేని.. వారంటు రద్దు

 

టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి శుక్రవారం పర్చూరు కోర్టుకు హాజరయ్యాయి. 2009 జులై నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అక్రమంగా కేసు బనాయించారని పేర్కొంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. కమిటీ విచారణ చేపట్టే సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో తనపై దాడి జరిగినట్లు నన్నపనేని రాజకుమారి కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పిటీషనర్‌గా ఉన్న రాజకుమారి విచారణకు హాజరై సాక్ష్యం చెప్పనందున న్యాయమూర్తి బెయిలబుల్ వారంటు జారీచేశారు. దీంతో శుక్రవారం ఆమె కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా వారంటు రద్దుకు పిటీషన్ వేయించి కోర్టులో సాక్ష్యం చెప్పారు. వాదనలు విన్న సీనియర్ సివిల్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు బెయిల్‌బుల్ వారంటు రద్దు చేస్తూ తీర్పుచెప్పారు.