లోక్‌సభ బరిలో నగ్మా

 

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన నటి నగ్మాకు ఈ సారి కాంగ్రెస్ లోక్‌సభ టికెట్ దక్కింది. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లోక్‌సభ ఎన్నికలకు 71 మందితో కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో నగ్మాకు చోటు దక్కింది. ఇక్కడ దయానంద్ గుప్తాను మార్చి మరీ నగ్మాకు టికెట్ ఇచ్చారు. రెండో జాబితాలో మొత్తం 11 మంది మహిళలకు చోటు కల్పించారు. మాజీ క్రికెటర్, మొరాదాబాద్ ఎంపీ అజారుద్దీన్‌కు రెండో జాబితాలో టికెట్ దక్కలేదు. ఆ స్థానాన్ని పార్టీ సీనియర్ నాయకురాలు బేగం నూర్ బానోకు కాంగ్రెస్ కేటాయించింది. ‘ముడుపులకు ఉద్యోగం’ కుంభకోణంతో సంబంధముందని ఆరోపణలు వచ్చిన రైల్వేశాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌ కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన్ను తిరిగి చండీగఢ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది.