మునిసి‘పోల్స్’లో హస్తవాసి?

 

తెలంగాణాలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కొంతవరకు సానుకూల వాతావరణం కనిపించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంటుందని, చాలాచోట్ల ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ నడిచిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఎంఐఎం కూడా కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలతోపాటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ పట్ల కొంచెం మొగ్గు ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నా... వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బాగా పోటీపడినట్లు కనిపిస్తోంది. ఒకటీరెండు చోట్ల బీజేపీ హవా కొంత కనిపించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. మునిసిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల పట్టణాల్లో సానుకూల వాతావరణం కనిపించిందని ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా రెబల్స్ బెడద లేకుండా చూడడంలో సఫలీకృతులయ్యారు.