విశాఖలో రూ.60 కోట్లతో ధోనీ క్రికెట్ అకాడమీ

 

మహేంద్రసింగ్ ధోనీ విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. మొదటినుంచి ధోనీకి విశాఖ అంటే ప్రత్యేక అభిమానం. 2005లో పాకిస్థాన్‌తో రెండో వన్డే ఆడేందుకు విశాఖలో అడుగుపెట్టిన ధోనీ 123 బంతుల్లో ఏకంగా 148 పరుగులు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తనకు అచ్చొచ్చిన విశాఖ అంటే అప్పటి నుంచి ధోనీకి అభిమానం. విశాఖ ఎంతో అందమైన నగరమని, అక్కడ ఉండడమంటే తనకెంతో ఇష్టమని ఓ సందర్భంలో చెప్పాడు. ఇప్పుడు ఏకంగా అకాడమీనే ఏర్పాటు చేసి నగరంతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు. తాజాగా ధోనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు.