ఆసియా కప్.. రోహిత్ కి రెస్ట్.. కెప్టెన్ గా ధోని..!!
posted on Sep 25, 2018 5:38PM
వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్.. ఆసియా కప్ సూపర్-4లో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. ఆప్ఘనిస్తాన్తో నేడు టీమిండియా తలపడుతోంది. టోర్నీ పరంగా ఈ మ్యాచ్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. టీమిండియాకు మాత్రం ప్రత్యేకమైన మ్యాచ్ అనే చెప్పాలి. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన ధోనీ.. ఈ మ్యాచ్కు మాత్రం కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇదే ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. తనకు మరోసారి కెప్టెన్గా అవకాశం రావడంపై ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. ‘నేను ఇప్పటి వరకు 199 మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్నాను. ఆ తరువాత కెప్టెన్సీ నుంచి వైదొలిగాక.. మరోసారి కెప్టెన్గా అవకాశం రావడంతో వన్డేల్లో 200 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. ఇది నిజంగా విధి కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను. విధిరాతను నేను తప్పకుండా నమ్ముతాను. మరోసారి నేను కెప్టెన్ కావడంలో నా ప్రమేయం లేదు. అయితే కెప్టెన్గా నా 200వ మ్యాచ్ను విజయవంతంగా ముగిస్తాను. అయితే ఇది పెద్ద విషయమేమీ కాదు’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.