రైతులను బ్రోకర్లు అన్న ఎమ్మార్వో వనజాక్షి.. తిరగబడ్డ రైతులు!!

టీడీపీ హయాంలో చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్ తో పాపులర్ అయిన ఎమ్మార్వో వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మార్వో వనజాక్షి నోరు జారడంతో  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభ ఏర్పాటు చేయగా.. సభలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడారు. సభ జరుగుతున్న సమయంలో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలన్నారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. రైతుల్ని బ్రోకర్లు అనడం ఏంటని ప్రశ్నించారు. 

ఎమ్మార్వో క్షమాపణలు చెప్పాలని రైతులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను బ్రోకర్లు అంటారా? అంటూ వనజాక్షి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. వనజాక్షి సభ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మార్వో బయటకు వస్తున్న సమయంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వనజాక్షిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో వనజాక్షి సంఘటనా స్థలం నుంచి బయట పడ్డారు. ఎమ్మార్వో వనజాక్షి తీరుపై మహిళలు, రైతులు మండిపడ్డారు. ఆమెపై ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.