తెలంగాణలో రిపీట్ అయ్యేది కర్ణాటక ఫలితాలే

 

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రధాని నరేంద్రమోదీ ఫ్యాక్షనిస్టుగా మారి ఏపీ ప్రజలను వేధిస్తున్నారని జేసీ మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను సైతం వెనక్కు తీసుకుని.. ఏపీపై కక్షసాధింపు చర్యలను ప్రధాని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ గొంతు బలంగా ఉందేమో గానీ..వ్యక్తిగా మాత్రం ఆయన బలహీనంగా కనిపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ ఫలితాలు ఉంటాయన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారన్నారు. ఏపీలో గెలుపు కోసం తెదేపా ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నందునే జాతీయ కూటమి ఆవిర్భావం జరిగిందని వివరించారు.