సినిమా టిక్కెట్ ధరలు పెంచారు
posted on Apr 27, 2013 10:18AM
రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. రూ.10 నుంచి 20 దాకా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ పచ్చజెండా ఊపేసింది. ప్రభుత్వం పొద్దున ఇలా ఉత్తర్వులు ఇచ్చిందో లేదో.. థియేటర్ల యజమానులు మధ్యాహ్నం రెండుగంటల ఆట (మ్యాట్నీ) నుంచే రేట్లు పెంచి టికెట్లు అమ్మడం మొదలుపెట్టేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని సినిమా థియేటర్లను ఐదు కేటగిరీలుగా విభజించి పెంపును అమలు చేస్తారు. అవి ఇలా ఉంటాయి...
- హైదరాబాద్లో ఏసీ థియేటర్లలో రూ.55గా ఉన్న బాల్కనీ టికెట్ ధర ఇకపై రూ.75, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.70, ఫస్ట్క్లాస్ టికెట్ల వెల రూ.45.
-విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, తిరుపతి, కర్నూలు, అనంతపురం లాంటి కార్పొరేషన్లలో బాల్కనీ రూ.75 (ఎయిర్కూల్డ్ రూ.70), తర్వాతి తరగతి టికెట్ల వెల రూ.40 .
-సెలక్షన్, స్పెషల్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో బాల్కనీ రూ.55 (ఎయిర్కూల్డ్ 50), తర్వాతి తరగతి టికెట్ల వెల రూ.35 అవుతాయి.
-సెకండ్, థర్డ్గ్రేడ్ మున్సిపాలిటీల్లో హైక్లాస్ రూ.50 (ఎయిర్కూల్డ్ రూ.45), దాని ముందు వరుస రూ.30.
-నగర, గ్రామ పంచాయతీల్లో ఏసీ మొదటి తరగతి రూ.45 (ఎయిర్కూల్డ్ 40), రెండో తరగతి రూ.30 .
- కేటగిరీలతో సంబంధం లేకుండా ఆఖరు తరగతి టికెట్లను రూ.10కే విక్రయించాలి.