ఆ బెంజ్ కారు నాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్.. మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడని ఆరోపించారు. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలని అన్నారు. ఏ 14 కార్తీక్ మంత్రి జయరాంకు బినామీ. ఆ కారు మంత్రికి అతడు ఇచ్చిన లంచం అని ఆరోపించారు. అంతేకాకుండా, మంత్రి కొడుకుకు ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14 నిందితుడుగా ఉన్న కార్తీక్ గిఫ్ట్ అందిస్తున్న కారు ఫోటోను అయ్యన్నపాత్రుడు మీడియాకు విడుదల చేసారు. ఈ ఫోటోను కార్తీక్ తన ఫేస్‌బుక్ లో కూడా పోస్టు చేశాడని ఆయన చెప్పారు.

 

అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై మంత్రి జయరాం స్పందించారు. అయ్యన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బెంజ్ కారు తనదే అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందో చూసుకోవచ్చన్నారు. తన కుమారుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని.. అలా తన కొడుకు చేతుల మీదుగా ఎవరైనా ఫ్యాన్స్ కారు కీస్ తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏదో ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కలిశారు. కారు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగారు. అయ్యన్న ఒకటే ఫోటో చూపించారు..ఇంకా నాలుగైదు ఉన్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.