వలసకూలీలపై స్ప్రే చేసి శుద్ది చేశారట!
posted on Mar 30, 2020 5:27PM
నిరుపేదలపై నిర్దయగా వ్యవహరించారు. యూపీలో ఈ దారుణం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుని వున్న వలసకూలీలను బస్సులు పెట్టి పిలిపించుకున్నారు. అంత వరకు బాగానే వుంది. అయితే వచ్చిన వారిని రోడ్డు మీదే కూర్చోబెట్టి మనుషులపైనే కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా చల్లే స్ప్రే చల్లారు. మీ కళ్ళను మూసుకోండి.. మీ పిల్లల కళ్ళను కూడా మూసేయండి అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. పిల్లలతో సహా ఆ బడుగు జీవులంతా కళ్ళు మండి విలవిలలాడిపోయిన దృశ్యాలు వైరల్ అయి చూసే వారిని కంటతడిపెట్టిస్తున్నాయి. అధికారుల అతి చేష్టలకు అభాగ్యులు విలవిలలాడారు.
వీరంతా కూలీ నాలీ చేసుకునే కార్మికులు. వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో చిక్కుబడిపోయిన వీరు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బరేలీ జిల్లాకు చేరుకున్నారు. వీరిలోని ఓ బ్యాచ్ బస్సు దిగగానే బిలబిలమంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మాస్కులతో సహా ప్రొటెక్టివ్ సూట్లు ధరించి అక్కడికి చేరుకున్నారు. వలస కార్మికులను ఒక చోట కూర్చోబెట్టి.. వారిపై ఈ స్ప్రేను చల్లారు. 'అప్ నే ఆంఖో బంద్ కర్ లో! బచ్చొంకీ ఆంఖ్ భీ బంద్ కర్ లే.. అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. ఈ అమానుషం పట్ల అధికారులను, పోలీసులు తమను తాము సమర్థించుకోవడం విశేషం. క్లోరిన్, నీటితో నింపిన ద్రవాన్నే చల్లాలని ఆదేశించామని, అంతే తప్ప ఎలాంటి కెమికల్ నీ ఇందులో కలపలేదని యుపి అధికారులు సమర్థించుకున్నారు.
భారీ సంఖ్యలో వేర్వేరు చోట్ల నుంచి వఛ్చిన వీరిని కరోనా పాజిటివ్ సోకకుండా, వీరి వల్ల మరెవరికీ ఎలాంటి 'ప్రమాదం' లేకుండా చూసేందుకు 'శుద్ది' చేసామంటూ చెబుతున్నారు అధికారులు తమను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారట మరి.... అది విషయం.