మాయావతి మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం.!!
posted on Dec 12, 2018 10:58AM
మధ్యప్రదేశ్ లో అధికారానికి రెండు అడుగుల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నామని బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్కు కేవలం రెండు సీట్ల దూరంలో నిలిచింది. దీంతో మాయావతి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఎన్నికల ఫలితాలపై తాజాగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీని అధికారానికి దూరం చేయడమే తమ లక్ష్యమన్నారు. అందుకోసమే తాము కృషి చేస్తామని చెప్పారు. అందుకే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు.
230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 114 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 109, బీఎస్పీ 2, ఎస్పీ ఒక చోట, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. అధికారం చేపట్టాలంటే 116 స్థానాల మ్యాజిక్ ఫిగర్ రావాలి. కానీ కాంగ్రెస్కు రెండు సీట్లు తక్కువగా 114 సీట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మాయావతి మద్దతు కోరగా ఆమె అంగీకరించారు. బీఎస్పీ 2 స్థానాలతో కలిపి కాంగ్రెస్కు 116 సీట్లు అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్కు ఎస్పీ కూడా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఎస్పీ సీటుతో కలిపి ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి 117 సీట్లు అయ్యాయి. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఈరోజు ఆ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు.