తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మన్నె గోవర్దన్‌ కి అస్వస్థత

 

టీఆర్‌ఎస్ లో నిరసన సెగలు రోజురోజుకి తారాస్థాయికి చేరుతున్నాయి. ఖైరతాబాద్ టిక్కెట్‌ను దానం నాగేందర్‌కు ఇవ్వొద్దంటూ మన్నె గోవర్ధన్ రెడ్డి వర్గీయులు నిన్న తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ టిక్కెట్ మన్నె గోవర్ధన్ రెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే ఈ వివాదం ఇంకాస్త ముదిరింది. ఈరోజు మన్నె గోవర్దన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌ను ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో మన్నె గోవర్దన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను దగ్గరలోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు ఖైరతాబాద్ టిక్కెట్‌ మన్నె గోవర్దన్‌రెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక కార్యకర్త తల పగుల కొట్టుకుని నిరసన తెలిపాడు.