దత్తన్నను తోసేసిన ఎమ్మెల్యేలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు  బడ్జెట్ సమావేశాల తొలిరోజు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఘెరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ

కిందపడ్డారు. ఉదయం 11 గంటలకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే విపక్ష కాంగ్రెస్ నేతలు ఒక్కపెట్టున ఆందోళనకు దిగారు. విపక్ష నేత అగ్నిహోత్రి తన సీట్లోంచి లేచి నినాదాలు చేశారు.

సభలో గందరగోళ పరిస్థితుల మధ్య గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైను మాత్రమే చదవి వినిపించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌‌, స్పీకర్ విపిన్ పార్మర్‌‌తో కలిసి బయటకు

వస్తుండగా స్పీకర్ ఛాంబర్ వద్ద గవర్నర్‌ను నిలువరించేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది.

సభ తిరిగి సమావేశం కాగానే గవర్నర్‌ను ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రాకుండా వారిని సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రితో పాటు ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజడ, వినయ్ కుమార్ ఉన్నారు.ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ చెందడాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని అన్నారు.