మంగళూరులో యువతిఫై గ్యాంగ్ రేప్.. !

 

 

 

ఓ యువతిఫై గ్యాంగ్ రేప్ ఘటనకు నిరసనగా ఢిల్లీ నగరం అట్టుడికే విధంగా తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలతో మాకేంటీ అనుకొన్నారు మంగళూరు లోని కొంత మంది యువకులు ! తల్లి తండ్రులు దూరమై ఒంటరిగా జీవిస్తున్న యువతి ఫై సమాజం తలదిన్చుకోనేలా దారుణంగా అత్యాచారానికి ఒడి గట్టారు.

 

18 సంవత్సరాల ఆ యువతి తండ్రి మరణించాడు. ఆ తర్వాత ఆమె తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. దీనితో ఆమె ఒంటరిగానే జీవన పోరాటం చేస్తోంది. ఆలాంటి దీనావస్థలో ఉన్న ఆ యువతిఫై కొంత మంది స్థానిక యువకులు కన్నేశారు. వారిలో ఓ యువకుడు ఏదో విషయంలో సహాయం చేస్తామంటూ మాయమాటలు చెప్పి ఆమెను ఓ రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను రేప్ చేసాడు.

 

వారి నుండి తప్పించుకొన్న ఆ యువతి చివరకు రోడ్డు మీదకు వచ్చి, ఓ ఆటోవాలా సహాయం కోరింది. అక్కడా ఆమెది అదే పరిస్థితి. అక్కడ నుండి తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్ళిన ఆ ఆటోవాలా కూడా తన స్నేహితులతో కలిసి ఆమెఫై అత్యాచారం చేసాడు. ఆ తర్వాత ఆమెను కర్ణాటక కేరళ సరిహద్దుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు.

 

అయితే, ఈ సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుఫై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస రేప్ లు జరిగిన అనంతరం ఫిర్యాదు చేయడానికి కుంబ్లే పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఆ యువతిని పోలీసులు వెళ్లిపొమ్మంటూ గెంటివేసినట్లు సమాచారం. కేవలం 24 గంటల వ్యవధిలో ఒకే యువతిఫై రెండు సార్లు గ్యాంగ్ రేప్ జరిగిన, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఈ నెల 23 న జరిగింది.

 

ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు స్థానిక మీడియా ప్రతినిధులతో కలిసి పోలీసులను నిలదీసిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆటోవాలాను పట్టుకొన్న పోలీసులు అతడిఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించేసరికి అతడు ఇచ్చిన వివరాలతో మిగిలిన ముగ్గురిని పట్టుకొన్నారు. ప్రస్తుతం ఆ యువతిఫై మొదటగా అత్యాచారం చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

ఆ యువతి ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.