హైదరాబాద్ లో భారీ వర్షాలకు మరో వ్యక్తి బలి..
posted on Sep 21, 2020 10:07AM
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నగర ప్రజల జీవనం అతలాకుతలం అవుతోంది. మరో పక్క వరుస ప్రమాదకర సంఘటనలతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం నేరేట్మెట్కు చెందిన చిన్నారి సుమేధ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి నాలాలో పడి కొట్టకుపోయి ప్రాణాలు కొల్పోయిన సంగతి మరిచిపోకముందే.. వరదనీటిలో తాజాగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన సరూర్నగర్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
బాలపూర్ ప్రాంతంలోని 35 కాలనీలకు చెందిన వరదనీరు సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో వచ్చి కలుస్తాయి. గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పెద్ద ఎత్తున మినీ ట్యాంక్బండ్ లోకి వచ్చి చేరుతున్నాయి. నిన్నరాత్రి అందరూ చూస్తుండగానే ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి వరదనీటిలో పడి కొట్టుకుపోయాడు. బాలాపూర్ మండలం అల్మాస్గూడకు చెందిన నవీన్కుమార్ (32) అనే ఎలక్ట్రీషియన్ నిన్న రాత్రి సరూర్నగర్ చెరువుకట్ట మీద నుంచి తపోవన్ కాలనీ మీదుగా సరూర్నగర్ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు కాసేపు అక్కడే నిరీక్షించిన నవీన్ కాసేపటి తర్వాత వరద నీటిని దాటే ప్రయత్నం చేశాడు. అయితే స్కూటీ అదుపుతప్పడంతో వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే దీనిపై సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల రోడ్లపైకి భారీగా నీళ్లు చేరడం తో పాటు నాలాలు పొంగిపోర్లడంతో బయటకు వెళ్లాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు.