వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాధ్ రథచక్రాల్
posted on Jul 10, 2013 9:00AM
వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాధ్ రథచక్రాల్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. నిజంగా పూరి వేదికగా జరిగే ఉత్సవాలలో ఈ రోజు నుంచి జగన్నాథ రథ చక్రాలు కథలనున్నాయి.. అందుకు సంభందించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తోంది. తొమ్మిదిరోజుల పాటు కన్నులపండువగా వేడుకలను నిర్వహించనుంది. అటు అహ్మదాబాద్ లోనూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గుజరాత్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ యాత్రకు సర్వం సిద్ధం అయ్యింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించేదుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.. ఆ వైభోగాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా పూరీ చేరుకుంటున్నారు.
యాత్ర ప్రారంభమైన క్షణం నుంచి రథం గమ్యస్థానం చేరేవరకు ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపరాదని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. జాతి, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ రథోత్సవంలో పాల్గొంటారు. స్వయంగా భక్తులే రథాన్ని లాగే అవకాశం ఉండటంతో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పోటిపడతారు. జగన్నాథుని సేవలో పాల్గొని పునీతులౌతారు.
ఏటా ఆషాడ శుద్ద విదియనాడు ప్రారంభమయ్యే రథయాత్ర ఏకాదశి వరకు నిరంతరంగా కొనసాగుతుంది. స్థానిక రాజ వంశస్థులైన గజపతుల ప్రథమ హారతితో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. బలభద్ర, జగన్నాథ, సుభద్ర వేర్వేరు రథాలపై భక్తులకు దర్శనమిస్తారు. ముగ్గురు దేవతలు జన్మించిన ప్రాంతంగా భావించే అడప మండపం వద్ద బస చేసి తొమ్మిదవ రోజున తిరుగు ప్రయాణం అవుతారు. ఇతర ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలను ఆలయ వీధుల్లో ఊరేగిస్తే.. పూరీలో అందుకు విరుద్ధంగా మూల విగ్రహాలనే ఊరేగింపుగా భక్తుల వద్దకు తీసుకెళ్తారు.
అటు గుజరాత్లోని అహ్మదాబాద్లోనూ ఈ రథయాత్రను కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడీ సర్కారు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్లోని పూరి జగన్నాధ్ స్వామి ఆళయంలో కూడా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.. పూరిని తలపించేలా రథాలను ముస్తాబు చేసిన జగన్నాథ స్వామి ఊరేగింపుకు సిద్దం చూశారు..