మావోయిస్టు పార్టీ నాయకత్వంలో మార్పులు

 

మావోయిస్టు పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతిని ఆ పదవి నుంచి తొలగాలని పోలిట్‌ బ్యూరో సభ్యులు అడిగినట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంపై బాధ్యత వహిస్తున్నానని, తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు కూడా గణపతి ప్రకటించినట్లు వెల్లడైంది. గణపతి స్థానంలో నంబాలా కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. నంబాలా కేశరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. వరంగల్‌ ఆర్‌ఈసీలో కేశవరావు ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 28 సంవత్సరాలుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.1980 జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 2005లోనే కేశవరావుపై రూ.50 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. వయోభారంతోనే పార్టీ బాధ్యతలను, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీని కూడా గణపతి, పార్టీకి అప్పగించినట్లు సమాచారం.