తెలంగాణ ఎన్నికల బరిలో లగడపాటి.!!

 

లగడపాటి రాజగోపాల్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. విజయవాడ ఎంపీగా కూడా పనిచేసారు. రాష్ట్రం విడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ఆయన.. అన్నట్టుగానే రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన సర్వేలు మాత్రం జరుపుతూనే ఉంటారు. ఆయన సర్వేల్లో దిట్ట. ఆయన్ని ఆంధ్రా ఆక్టోపస్ అని కూడా అంటారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన సర్వే కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన సర్వే గురించి.. అదే విధంగా ఎన్నికల్లో పోటీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

తాజాగా లగడపాటి మీడియాతో  మాట్లాడారు. తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలతో తనకు సంబంధం లేదని ఆయన ప్రకటించారు. పార్టీలు కోరితే సర్వేలు చేసి చెబుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో పోటీ చేసే అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 7వ తేదీ తర్వాత తన సర్వే వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు సక్సెస్ అవుతోందా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారని లగడపాటి అన్నారు.