కెవిపికి సిబిఐ నోటీసులు
posted on Mar 22, 2013 2:44PM
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు శుక్రవారం సీబీఐ నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కేవీపీని సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ ఎదుట కేవీపీ హాజరు కానున్నారు. కేవీపీ గురించి సీబీఐ అడిగిన సమాచారాన్ని తీసి ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. 2004 నుంచి 2011 మధ్య కాలంలోని ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇంతకుముందే ప్రభుత్వానికి పలు వివరాలు కావాలని సీబీఐ లేఖ రాసింది. అవి ఇవ్వకుండా ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిన కేవీపీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ఆయనదే ప్రధాన పాత్ర. వైఎస్ ఆప్తమిత్రుడిగా, ఆయన ఆత్మగా కేవీపీ పేరుపడ్డారు. వైఎస్ మరణం తరువాత కేవీపీ ప్రాధాన్యం తగ్గినా ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆయనకు సీబీఐ నోటీసులు రావడం అనేది చర్చానీయాంశంగా మారింది.