ఖుష్బూది కాంగ్రెస్ రక్తమట.. అబ్బా..

 

సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటి వరకు డీఎంకే పార్టీలో వున్న ఖుష్బూ ఆరు నెలల క్రితం ఆ పార్టీకి గుడ్ బై కొట్టారు. అప్పటి నుంచి ఆమె ఏ పార్టీలోనూ చేరలేదు. ఖుష్బూ బీజేపీలో చేరబోతోందన్న వార్తలు అడపాదడపా వినిపించాయి. అయితే ఆమె ఆ వార్తలను ఖండించారు. ఎట్టకేలకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఖుష్బూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖుష్బూని సోనియాగాంధీకి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పరిచయం చేశారు. ఖుష్బూ లాంటి బహుళ ప్రజాదరణ వున్న నటీమణి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయని భావిస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు జీకే వాసన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన లోటుని ఇప్పుడు ఖుష్బూ మేడమ్ తీర్చగలదని తమిళనాడు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా వుండగా, కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు తన సొంత ఇంటికి వచ్చినట్టుగా వుందని, తనది కాంగ్రెస్ రక్తమేనని ఖుష్బూ ఆనందంగా చెబుతోంది.