వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాలకు మించి గెలవలేదు

 

ఓ వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం, మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకం .. ఈ ఆనంద సమయంలో కేటీఆర్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు తాము రుణపడి ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ది చిరస్మరణీయమైన, మరచిపోలేని విజయమన్నారు. టీఆర్‌ఎస్‌కు ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 98లక్షల ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు 48లక్షల అంతరం ఉందని తెలిపారు. 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని ఎద్దేవా చేసారు.

ఎన్నికలకు ముందు తాను చెప్పిన మాట నిజమైందని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించారన్నారు. ప్రజాకూటమిని బలవంతంగా జనంపై రుద్దే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మీడియా, డబ్బు బలంతో ప్రజలు అయోమయం చేయాలనుకున్నారని విమర్శించారు. ప్రజా చైతన్యం ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవని అన్నారు. కాంగ్రెస్‌ గెలిచిన చోట ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ప్రజల తీర్పును సమీక్షించాలని, ఆరోపణలు సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా టీఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కానీ, బీజేపీ కానీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాలకు మించి గెలవలేదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలకే ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రాన్ని శాసించగలమన్నారు. దేశానికి తెలంగాణను దిక్సూచిగా మారుస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.