హైకోర్టు విభజనకు అడ్డుపడింది చంద్రబాబే

 

అంబర్‌పేటలో ‘అడ్వకేట్స్‌ ఫర్‌ టీఆర్‌ఎస్‌’ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే కారణమని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో హైకోర్టు విభజన విషయంలో కేంద్రం పలుమార్లు మాట ఇచ్చినా.. ఎన్డీయే భాగస్వామిగా ఉండి నాలుగేళ్లుగా అడుగడుగునా ఆయన అడ్డుపడ్డారని అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు మౌన దీక్షలు చేసినా, వెల్‌లోకి దూసుకెళ్లినా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సైందవుడిలా అడ్డుపడింది మాత్రం ముమ్మాటికీ చంద్రబాబేనన్నారు. ఆయనకు ఉన్న అన్ని సంబంధాలను వినియోగించుకొని స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు విడిపోతే తన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన హైకోర్టు విభజన అడ్డుకున్నారన్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వెళ్లాక మళ్లీ హైకోర్టు విభజన అంశంలో కదలిక వచ్చిందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జనవరిలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటవుతుందన్న నమ్మకం తనకుందన్నారు.