సురేఖ అసంతృప్తి
posted on Jul 27, 2013 5:15PM
తెలంగాణ పార్టీ నేతలతో జగన్ పార్టీ అంతరం క్రమక్రంగా పెరుగుతోంది. విజయమ్మతో భేటి తరువాత కొండా సురేఖ మీడియా తో మాట్లాడుతూ... సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమో, పార్టీ నిర్ణయమో తమకు అధిష్టానం చెప్పలేదన్నారు. తాము అసంతృప్తితోనే బయటకు వచ్చామని చెప్పారు.
సీమాంధ్ర నేతల రాజీనామాల పైన, తెలంగాణ విషయంలో తమకు సరైన సమాధానం దొరకలేదని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్నామనే అపవాదు తమకు వద్దని ఆమె అన్నారు.
సీమాంధ్ర ఎమ్మెల్యేల నిర్ణయం పార్టీ వైఖరి కాకపోతే తమకు ఇప్పటి వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీ వైఖరి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తామంతా మరోసారి చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సురేఖ అన్నారు.