టీడీపీలోకి కొండా దంపతులు?

 

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు తిరుగులేని నేతలైన కొండా దంపతులు- మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ టీడీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబుతో ఇందుకోసం కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కొండా దంపతులను టీడీపీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అయితే ఈ విషయంపై జిల్లా నేతలతో బాబు కూడా చర్చించినట్టు సమాచారం. పరకాలతో పాటు మరో అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ల కోసం కొండా దంపతులు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. సోనియాకు సన్నిహితులైన ముఖ్య నేతల ద్వారా సిఫారసులు చేయించుకున్నా ఫలితం దక్కలేదు. దీనికి తోడు తమను వ్యతిరేఖించే పొన్నాల లక్ష్మయ్య తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా రావడంతో వారి ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. తొలుత బీజేపీలో చేరాలని భావించినా, తర్వాత మనుసు మార్చుకొని టీడీపీవైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.